ఏపీ పాఠశాల విద్యాశాఖ ‘ఏపీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్’ (AP TET JUNE-2026) నిర్వహణకు గతంలో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో 1 నుంచి 8వ తరగతి వరకు బోధించాలనుకునే అభ్యర్థులకు ఈ పరీక్ష తప్పనిసరి. ఇదిలా ఉంటే.. టెట్ ఆన్లైన్ అప్లికేషన్ల గడువు జులై 5తో ముగియనుంది. ఇంకా అప్లై చేసుకోని వారు వెంటనే అధికారిక వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాలని అధికారులు వెల్లడించారు. ఉపాధ్యాయ నియామకాల్లో (DSC) ఈ టెట్ స్కోరుకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. కాబట్టి ఇందులో మంచి మార్కులు సాధించడం చాలా ముఖ్యం.
ఎవరెవరు అర్హులు?
సంబంధిత విభాగంలో కనీసం 40 నుంచి 50 శాతం మార్కులతో ఇంటర్, డిగ్రీ లేదా పీజీ పూర్తి చేసిన వారు దీనికి అర్హులు. వీటితో పాటు డీఈఎల్ ఈడీ (D.El.Ed), బీఈడీ (B.Ed) లేదా తత్సమాన కోర్సులు పూర్తి చేసి ఉండాలి. ప్రస్తుతం ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు రాస్తున్న అభ్యర్థులు కూడా ఈ టెట్ పరీక్షకు అప్లై చేసుకోవడానికి అర్హులేనని అధికారులు స్పష్టం చేశారు.
అప్లికేషన్ ఫీజు:
అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ cse.ap.gov.in ద్వారా కేవలం ఆన్లైన్ మోడ్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో మొత్తం నాలుగు పేపర్లు ఉంటాయి. అభ్యర్థులు రాసే ప్రతి పేపరుకు (Paper-1A, 1B, 2A, 2B) విడివిడిగా రూ. 1000 చొప్పున అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
అప్లికేషన్ ప్రక్రియ:
జూన్ 5 నుంచి అప్లికేషన్లు ప్రారంభం కాగా, జులై 5 వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
పరీక్షా విధానం,షెడ్యూల్ :
ఈ పరీక్షను మొత్తం 150 మార్కులకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) పద్ధతిలో ఆన్లైన్లో నిర్వహిస్తారు. ఆగస్టు 5వ తేదీ నుంచి 21వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ప్రతి రోజూ రెండు సెషన్లలో ఈ ఎగ్జామ్స్ ఉంటాయి. మొదటి సెషన్ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు జరుగుతుంది. అభ్యర్థులు జులై 25 నుంచి తమ హాల్ టికెట్లను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఫలితాల విడుదల:
ఆగస్టు 24న టెట్ ప్రాథమిక కీ విడుదల చేయనున్నారు. దీనిపై ఆగస్టు 25 నుంచి 31 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. అనంతరం సెప్టెంబర్ 8న ఫైనల్ కీ ని, సెప్టెంబర్ 15న ఫైనల్ రిజల్ట్స్ను అనౌన్స్ చేస్తారు.





