ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా సొసైటీ (పాఠశాల విద్యాశాఖ) ఆధ్వర్యంలో నిర్వహించే కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయా(కేజీబీవీ)ల్లో 2024-25 విద్యా సంవత్సరం (ఏడాది) కాలానికి బోధన, బోధనేతర సిబ్బంది ఖాళీలను భర్తీ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు షార్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది. కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న బోధనా సిబ్బందిని కాంట్రాక్ట్ ప్రాతిపదికన, బోధనేతర సిబ్బందిని పొరుగుసేవల ప్రాతిపదికన నియామక ప్రక్రియ చేపడతారు. ఆసక్తి, అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు మాత్రమే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.
ఖాళీల వివరాలు: ప్రిన్సిపల్- 10; పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ)- 165; సీఆర్టీ (సీఆర్టీ)- 163; ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (పీఈటీ)- 4; పార్ట్ టైం టీచర్ (పీటీటీ)-165, వార్డెన్- 53; అకౌంటెంట్- 44. మొత్తం 604 ఖాళీలున్నాయి. వయసు ఓపెన్ కేటగిరి అభ్యర్థులకు 18- నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, మాజీ సైనికులకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
అప్లికేషన్స్: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 10 వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఆసక్తిగల మహిళా అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు రూ.250 చెల్లించాలి. పూర్తి వివరాలకు www.apkgbv.apcfss.in వెబ్సైట్లో సంప్రదించాలి.