ఎంసెట్ కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది ఎంసెట్ పరీక్షలో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. 2020-21, 2021-22 విద్యాసంవత్సరంలో ఇంటర్ విద్యార్థులకు కరోనా కారణంగా ఎగ్జామ్స్ నిర్వహించలేదు. దీంతో ఇంటర్ మార్కులకు ఎంసెట్ లో ఎలాంటి వెయిటేజీని ఇవ్వలేదు. ఈ సారి ఎంసెట్ రాసే విద్యార్థులు ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండియర్ పరీక్షలు రాశారు. దీంతో ఎంసెట్ ఫలితాల్లో వారికి ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. ఎంసెట్ రాసే విద్యార్థులకు ఇంటర్ మార్కులకు వెయిటేజీ ఇవ్వడంతో ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.
ఇంకా ప్రస్తుతం ఎంసెట్ రాయబోయే విద్యార్థులు గతేడాది ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో 70 శాతం సిలబస్ కే బోర్డు ఎగ్జామ్స్ రాశారు. దీంతో ఆ సిలబస్ నుంచే ఎంసెట్ లో ప్రశ్నలు ఇవ్వనున్నారు. ఇంకా సెకండియర్ లో మాత్రం పూర్తి సిలబస్ ఉంటుంది. అయితే ఏపీలో ఎంసెట్ (EAMCET) పరీక్షను గత రెండేళ్లుగా ఈఏపీసెట్ (EAPCET)గా పిలుస్తున్నారు. మెడిసిన్ అడ్మిషన్లను నీట్ ద్వారా నిర్వహిస్తుండడంతో ఎంసెట్ పరీక్షను ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ గా పిలుస్తున్నారు.