ఏపీలోని సీఎం జగన్ (CM Jagan) సర్కార్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమైంది. భారీగా ఉద్యోగాల (AP Jobs) భర్తీకి కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీలను భర్తీ చేయడానికి ఏర్పాట్లు జోరుగా సాగుతోంది. మొత్తం 14,523 ఖాళీలను భర్తీ చేయడానికి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ (AP Government Jobs Notification) విడుదల చేయనున్నారు. ఏపీలో సీఎం జగన్ సీఎం పదవిని చేపట్టిన వెంటనే మొత్తం 1.34 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశారు. నాలుగు నెలల్లోనే ఈ నియామక ప్రక్రియ పూర్తయింది. అనంతరం మిగలిన ఖాళీలకు 2020లో నోటిఫికేషన్ విడుదల చేశారు.
అప్పుడు కూడా వివిధ కారణాలతో భర్తీ కాకుండా మిగిలిన పోస్టులను తాజా నోటిఫికేషన్ తో భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్ విడుదల చేసిన రెండు నెలల్లోనే ఇందుకు సంబంధించిన రాత పరీక్షను సైతం నిర్వహించాలన్నది అధికారుల ఆలోచనగా తెలుస్తోంది. ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదలైతే ఏప్రిల్ లో రాత పరీక్షను నిర్వహించే అవకాశం ఉంది. పంచాయితీ రాజ్ శాఖ ఆధ్వర్యంలోనే ఈ నియామక ప్రక్రియ కొనసాగనుంది. ఈ మేరకు గత సోమవారం గ్రామ, వార్డు సచివాలయ శాఖ అధికారులు పంచాయితీ రాజ్ శాఖకు లేఖ రాశారు. శాఖల వారీగా ఖాళీల వివరాలను ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 20 కేటరిగీల్లో నియామకాలను చేపట్టనున్నారు.