ఏపీలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల విద్యాలయాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీ సాంఘిక సంక్షేమ నివాస విద్యా సంస్థల సొసైటీ (APSWREIS) ద్వారా నిర్వహించే BRAG SET-2026 కోసం 5వ తరగతి, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేరడానికి అర్హులైన విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. వీటితో పాటు.. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న మిగిలిన ఖాళీ సీట్లను కూడా ఈ ప్రక్రియ ద్వారా భర్తీ చేయనున్నారు.
ఈ ప్రవేశాలకు సంబంధించి ప్రస్తుతం 4వ తరగతి చదువుతున్న వారు ఐదో తరగతికి, 10వ తరగతి చదువుతున్న వారు ఇంటర్ కోసం అప్లై చేసుకోవడానికి అర్హులు. అప్లికేషన్ ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్ విధానంలోనే ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు జనవరి 20 నుంచి అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ ఫిబ్రవరి 19. ప్రవేశ పరీక్షలో అభ్యర్థులు సాధించిన ప్రతిభ (మెరిట్), రిజర్వేషన్ నిబంధనల ఆధారంగానే సీట్ల కేటాయింపు జరుగుతుంది.
రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద, వెనుకబడిన తరగతుల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ఈ సంస్థలను నడుపుతోంది. ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు వసతి, భోజనం, పాఠ్యపుస్తకాలు, ఇతర సౌకర్యాలను ప్రభుత్వం ఉచితంగా కల్పిస్తుంది. గతంలో సాంఘిక సంక్షేమ గురుకులాలుగా ఉన్న వీటిని 2022లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకులాలుగా మార్చారు.
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 190 గురుకుల సంస్థలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 67 బాలుర కోసం, 123 బాలికల కోసం ప్రత్యేకంగా కేటాయించారు. అధికారిక వెబ్సైట్ https://apgpcet.apcfss.in ద్వారా నిర్ణీత గడువులోగా అప్లై చేసుకోవాలని అధికారులు సూచించారు.





