తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్. రాష్ట్రంలో 50 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలో డైరెక్టు రిక్రూట్ మెంట్ పోస్టులతో పాటు అన్ని రకాల ఉద్యోగాలు దాదాపు 50 వేలు ఖాళీగా ఉన్నాయి. వాటిని ముందుగా భర్తీ చేస్తామని సీఎం ప్రకటించారు. ఇప్పుడున్న ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వడం ద్వారా ఏర్పడిన ఖాళీలను గుర్తించి రెండో దశలో భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారంతో కూడిన నివేదికను సిద్దం చేసి ఈ నెల 13 వ తేదీన కేబినెట్ మీటింగ్కు తీసుకురావాలని సీఎం అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి కొత్త జోనల్ విధానానికి ఇటీవలే అడ్డంకులు తొలిగిపోయాయి. రాష్ట్రంలో కొత్త జోన్లను ఏర్పాటు పై ఇటీవలే రాష్ట్రపతి ఆమోద ముద్ర లభించింది. ఈ నేపథ్యంలో సీఎం అధ్యక్షతన శుక్రవారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో వెంటనే రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీల భర్తీ చేయాలనే కీలక నిర్ణయం తీసుకుంది.